ఆజం జాహీ మిల్లు చరిత్ర ఆగమాగం?

ఆజంజాహీలో మరోమారు వార్తల్లో ప్రధాన అంశం అయింది . చారిత్రాత్మక ఆజంజాహి మిల్ కార్మికులు పైసా పైసా పొగేసి 1400 గజాల స్థలంలో ( రహదారి వెంట) కట్టుకున్న కార్మిక భవనం నేలమట్టమవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. కబ్జాదారుల కబంధ హస్తాలలో చిక్కి 75 ఏళ్ల నిషాన్ కనుమరుగయ్యింది. కోట్లాది రూపాయల విలువ చేసే కార్మిక భవనాన్ని కూల్చి, ఆ స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల అండతో శంకుస్థాపన చేసిన 24 గంటల్లో మట్టిలో కలిసిపోయింది. అసలు ఈ స్థలాన్ని అమ్మింది ఎవరు? కొన్నది ఎవరు? అమ్మకాలు కొనుగోళ్లు ఎలా సాధ్యమయ్యాయి? మధ్య వర్తులు ఎవరు? కోర్టులలో కొనసాగుతున్నవివాదం పరష్కారం కాకుండానే ఇదంతా ఎలా జరుగుతుంది? ఇన్ని ప్రశ్నలు సమాధానం లేకుండా అలాగే ఉండగా, వివిధ రాజకీయ పార్టీల నేతలు, పెట్టుబడి దారులు ఎన్నో ఏళ్ళుగా జరుపుతున్న కుట్రలకు బలై కార్మిక భవనం నేడు రూపురేఖలు లేకుండా పోయింది. పలు ప్రజా సంఘాలు,కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నుండి వినతులు,నిరసనలు వెల్లువెత్తడంతో తాత్కాలికంగా కొత్త నిర్మాణం వాయిదా పడింది. కార్మికుల సమస్యలు చర్చించడానికి, పరిష్కారానికి వేదికగా ఉంటున్న, కూల్చిన కార్మిక సంఘ భవనం తిరిగి నిర్మాణం జరిగేనా? కార్మిక సంఘ భవనం తిరిగి ఎవరు నిర్మిస్తారు? కూల్చినవారా? సహకరించిన వారా? ప్రభుత్వమా? ఎవరు బాధ్యత తీసుకుంటున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న.

పార్టీ లన్నిటిదీ తిలాపాపం తలా పిడికెడు

వరంగల్ నగర అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆజం జాహి మిల్క్ కార్మికులది కీలక పాత్రమైనది. ఈ పరిశ్రమ తెలంగాణకు తలమానికం. నాణ్యమైన బట్టల మిల్లుగా దేశంలోనే గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసి లాభాలు గడించిన సంస్థ . తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా వరంగల్ అవతరించడానికి కారణమైంది. పారిశ్రామిక రంగానికి పునాదులు వేసింది కూడా ఈ పరిశ్రమే. ఆజం జాహి మిల్లు మూతపడి, అన్యాక్రాంతమై30 ఏళ్ళు. ఈ పరిశ్రమను పునరుద్ధరించాలని కార్మికులు ప్రజా సంఘాలు చేసిన ఉద్యమ మంటల్లో రాజకీయ పార్టీల నేతలు సెగ కాసుకున్నారు. కానీ, కార్యక్రమంలో కార్మికుల జీవితాలు అత్యంత దుర్భరంగా మారాయి. సంఘీభావం ప్రకటించిన రాజకీయ నాయకుల జీవితాలను మాత్రం మరింత ముందుకు, పైపైకి తీసుకెళ్లాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీ లన్నిటిదీ తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఉన్నది.

206 ఎకరాల స్థలంలో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ

ఆజం జాహి మిల్స్ – వస్త్ర పరిశ్రమను ఏడవ నిజం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మొదటి కుమారుడు ప్రిన్స్ ఆజం జాహి పేరుతో 1934 లో 206 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ. ఆనాడే పదివేల మందికి పైగా ఉపాధి పొందారు. ఈ పరిశ్రమ సైరన్ వరంగల్ చుట్టుపక్క గ్రామాలకు *వేకప్ కాల్* గా ఉండేది. కాలగమనంలో 1974 లో దీనిని బెంగళూరుకు చెందిన నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ (N.T. C).స్వాదీనం చేసుకుంది. 1980 వరకు ఆరు దశాబ్దాల పాటు పరిశ్రమ పనిచేసింది. అనారోగ్యంతో, అస్తవ్యస్తంగా మారిన పరిశ్రమను 1990 నాటికి మూసి వేశారు. 2002 సంవత్సరంలో 226 ఎకరారల స్థలములో నిర్మితమైన మిల్లు పూర్తిగా మూత పడింది. దానిలోని 65 ఎకరాలు ఏపీ హౌసింగ్ బోర్డు కొనుగోలు చేసి 30 ఎకరాలు టెక్స్టైల్ పార్కు వారికి అమ్మి వేసింది. రాంకీ సంస్థకు 30 ఎకరాలు అమ్మగా అదనంగా 10 ఎకరాలు ఆక్రమించుకొని ఇళ్ళు కట్టి కోట్లాది రూపాయలు పోగేసుకుంది. యాకూబ్ పుర లో ఉన్న ఏడు ఎకరాల భూమి కూడా ఆజం జాహి మిల్లుదేనని తెలుస్తుంది. ఈ మిల్లు స్థలానికే చెందిన 46 ఎకరాల భూమి పలు రాజకీయ పార్టీలు పలు సందర్భాలలో ఆక్రమించి ఇళ్లు నిర్మించి అమ్మినట్టుగా కథనం ఉంది. ఆజం జాహి మిల్లు స్థలం,కబ్జాకు గురైన మిగిలిన భూమి సుమారు 20 ఎకరాలు ఏమైంది? అనే విషయం తెలాల్సి ఉంది. KUDA కొనుగోలు చేసిన స్థలం, ప్లాట్లుగా చేసి విక్రయించిన స్థలంలో ఉన్న 134 క్వార్టర్స్ లో మిల్లులో పదవీ విరమణ చేసిన కార్మికులు కూడా ఉన్నారు. ఇప్పుడు కేవలం 30 ఎకరాల భూమి మాత్రమే NTC కి ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికులకు ఇండ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణం ఇంకా కొలిక్కి రానేలేదు. మద్యంతరంగా వీధిన పడ్డ కుటుంబాలకు అనివార్యంగా ఉపాధి కల్పన చేయాలానే చర్చ జరడంలేదు.

నేతలు మాటలు నీటి మూటలు

ఇతర ప్రాంతాల ప్రజలు విద్యుత్ కాంతులు చూడకముందే, ఆజం జాహి మిల్ కారణంగా వరంగల్ పట్టణంలోని ఇళ్లు, వీధులు ప్రకాశవంతం కాబడ్డాయి. గొప్పగతాన్ని, చరిత్రను కలిగిన ఆజంజాహి మిల్ అదృశ్యమైంది. నాటి కార్మికులు నేడు ఆటో రిక్షా కార్మికులుగా మారి ఉపాధి పోసుకుంటున్నారు. కబ్జాదారుల నుండి తమ కార్యాలయాన్ని కాపాడుకోవడానికి కార్మికులు చేస్తున్న ఉద్యమ వేడి చల్లారక ముందే భవనం నేల మట్టమైపోయింది. ఇదిలా ఉండగానే, జిల్లాలో ఆరు లక్షల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన బొగ్గు నీరు భూమి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. టెక్స్ టైల్ లో మిల్లులను ఏర్పాటు చేస్తే 15 నుండి 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కాటన్ ఫ్యాబ్రిక్ అని కాంపోజిట్ టెక్స్ టైల్స్ మిల్లు ఏర్పాటు చేయాలని నేతల ప్రతిపాదించారు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం 2017 లో 1200 ఎకరాల భూమి సేకరించారు. వస్త్ర తయారీ, బట్టలు కుట్టడం ఇక్కడే ఉంటుందని 2010 లో శంకుస్థాపన చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి భూమి ఇచ్చిన వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 100 కోట్లతో ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడిచినా ముందడుగు పడ్డ దాఖలాలు లేవు. నేతలు మాటలు నీటి మూటలుగా మిగిలాయి.

ప్రభుత్వ భూములకు పాలకులు కేవలం సంరక్షకులు మాత్రమే. యజమానులు కాదన్నది స్పష్టంగా అర్ధం చేసుకోవలసిన విషయం. కానీ, ప్రభుత్వ భూములను అమ్మి వేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం నిత్య కృత్యంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన అభివృద్ధి చెందుతామని భావించి చేసిన త్యాగాలు గుర్తింపు లేకుండా పోయాయి. పౌర ప్రజాస్వామిక ఆకాంక్షలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉద్యమకారుల ఊసే లేదు. పరాయి పాలన పోయినా, స్వరాష్ట్రం లోకూడా కార్పొరేట్ శక్తుల ఆగడాలు ఆగడం లేదు. కబ్జాల కోరలు చాస్తూనే ఉన్నాయి. సహజ వనరులు యాదేచ్ఛగా కొల్లగొట్ట బడుతూనే ఉన్నాయి. పీడిత ప్రజానీకం,ఉద్యమ కారులకు అండగా కార్మిక – కర్షకులు, విద్యార్ధి – యువజనులు, ప్రజాస్వామికవాదులు, కవులు-కళాకారులు, కర్షకులు, బుద్ధి జీవులు ఒక్క తాటి పైకి వచ్చి పాలకులను నిలదీసి ప్రశ్నించగలిగితే తప్ప తెలంగాణా రాష్ట్ర భవిష్యత్తు మరింత దుర్భరమవుతుందనేది చారిత్రక సత్యం

✍🏼 రమణా చారి

Spread the love